ఎన్నికల బరిలో సోనూసూద్ సోదరి.. ప్రకటించిన సోనూ.. ఎక్కడి నుంచంటే..

  • పంజాబ్ ఎన్నికల్లో పోటీ
  • మోగా నుంచి బరిలోకి
  • ఏ పార్టీ నుంచన్నది త్వరలోనే ప్రకటిస్తామన్న సోనూ
  • సీఎంను కలిశానని వెల్లడి
  • ఆప్, శిరోమణీ అకాలీదళ్ లీడర్లనూ కలుస్తానని కామెంట్
సోనూసూద్ సంచలన ప్రకటన చేశారు. తన సోదరి ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించారు. రాబోయే పంజాబ్ ఎన్నికల్లో మోగా నియోజకవర్గం నుంచి బరిలో నిలుస్తారని ఆయన వెల్లడించారు. ఇవాళ తన సోదరి మాళవికా సూద్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రకటించారు. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్న విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, సరైన సమయంలో ఆ నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు.

ప్రజలకు సేవ చేసేందుకు మాళవిక సిద్ధమైందన్నారు. ఇటీవలే తాను రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీని కలిశానని, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్, శిరోమణీ అకాలీదళ్ అధ్యక్షుడు సుక్బీర్ సింగ్ బాదల్ నూ కలుస్తానని చెప్పారు. ఏ రాజకీయ పార్టీలో చేరాలన్నది సిద్ధాంతాలకు సంబంధించిన విషయమని, సమావేశాలతో అదయ్యేది కాదని తెలిపారు.

తాను రాజకీయాల్లోకి వస్తానా? రానా? అన్నది పక్కనపెట్టాలని, దానిపై తన నిర్ణయాన్ని తర్వాత ప్రకటిస్తానని చెప్పారు. ముందు మోగాలో మాళవికకు మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. ఆరోగ్య రంగమే ఆమెకు కీలకమని, గెలిస్తే కిడ్నీ పేషెంట్లకు ఉచితంగా డయాలిసిస్ సేవలను అందిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగిత సమస్యపైనా పోరాడుతుందన్నారు. ఉద్యోగం లేనప్పుడే యువత డ్రగ్స్ తీసుకుని చెడు దారులు తొక్కుతుందని అన్నారు.

Sonu Sood
Sister
Punjab
Elections
Moga
Malavika Sood

More Telugu News